ఈవీఎంలపైనే తప్పంతా…
మరి మార్పు ఎప్పుడు
విజయవాడ, జూన్ 17, (న్యూస్ పల్స్)
Everything is wrong with EVMs :
వైఎస్ఆర్సీపీ ఓటమికి బాధ్యత ఎవరిది ? . ఇప్పడా పార్టీ దిగువ స్థాయిలో జరుగుతున్న చర్చ ఇది. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లు వైసీపీ గెలుచుకుంటే మొత్తం క్రెడిట్ను తన ఖాతాలో వేసుకున్నారు వైఎస్ జగన్ మోహన్రెడ్డి. 2024 ఘోర ఓటమికి మాత్రం ఎలాంటి బాధ్యత తీసుకోవడం లేదు. ఈవీఎంలను విమర్శిస్తున్నారు. తాము ప్రజలకు మంచే చేశామంటున్నారు. బహిరంగసభల్లో చెప్పినవన్నీ మళ్లీ మళ్లీ చెబుతున్నారు.
మేనిఫెస్టోను అమలు చేశామంటున్నారు. కొంత మంది నేతలు సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంవో అధికారులుగా ఉన్న ధనుంజయరెడ్డి వంటి వారిని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. వైసీపీ ఘోర పరాజయానికి బాధ్యత తీసుకునేందుకు ఆ పార్టీ నేతలు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రతి విజయానికి తనదే ఘనత .. తన ఫోటోనే గెలిపిస్తుందని జగన్ చెప్పుకుంటారు. ఆయన ఆలోచనలకు తగ్గట్లుగానే పార్టీ నేతలు సీఎంవోలో ఉన్నతాధికారిగా పని చేసిన ధనుంజయ్ రెడ్డి , సజ్జల వంటి వారి మీద నిందలేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి నేరగా ప్రజలముందు ఉన్నా ప్రభుత్వాన్ని నడిపింది ఆయన కాదని చెప్పేవారు ఎక్కువ. వైసీపీ పాలనలో సెక్రటేరియేట్కు, అసెంబ్లీకి విలువ ఇవ్వలేదు. ప్రజాప్రతినిధులు గీత దాటి మాట్లాడుతుంటే ఏనాడూ అడ్డుకోలేదు. పైగా మెప్పించిన వారికి పదవులు ఇచ్చారు. ప్రజాప్రతినిధులను, ప్రజల్ని ఎవర్నీ పెద్దగా కలవలేదు. అందరికీ దూరం అనే పరిస్థితిని జగనే తెచ్చుకున్నారు. అమరావతి పట్టాలెక్కడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు దెబ్బేనా ? నిపుణులేం చెబుతున్నారు సలహాదారులు, అధికార యంత్రాంగం వైఎస్ రాజశేఖరరెడ్డి దగ్గర కూడా ఉన్నారు.
ఇప్పుడు జగన్ వద్ద అత్యంత పలుకుబడిగల వ్యక్తిగా పేరు పొందిన సజ్జల కంటే, వైఎస్ దగ్గర ఆయన ఆత్మగా చెప్పుకునే కేవీపీ రామచంద్రరావు కూడా ఉన్నారు. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎప్పుడూ ప్రజలనుంచి దూరం కాలేదన్న అభిప్రాయం ఉంది. ప్రజా దర్బార్ పేరుతో వారానికి రెండు సార్లు ప్రజలతో ప్రత్యక్షంగా కలిసి వారి బాధలు వినేవారు. సామాన్య కార్యకర్తనుంచి, అనేక నియోజకవర్గాల నుంచి వచ్చే పార్టీ నేతలతో, ప్రతిపక్షపార్టీల వారితో సైతం వైఎస్ కలిసేవారు. తన సొంత తండ్రి చూపిన రాజకీయ బాట కళ్లముందే ఉండగా ఆయన వేరే దారిని ఎంచుకున్నారు. తాను అందరికీ దూరంగా ఉంటూ.. దైవసమానుడిగా ప్రచారం చేయించుకునేందుకు ఆసక్తి చూపించారు.
ఏకపక్ష మెజార్టీ వచ్చిన తర్వాత జగన్ రెడ్డి ప్రజల్ని టేకిట్ గ్రాంట్ గా తీసుకున్నారని అనుకోవచ్చు. అమరావతే రాజధాని అని నినదించి.. రాజధాని అంటే ఎలా ఉండాలో తన నోటితో వివరించినట్లుగానే ఉన్న అమరావతిని ఏకపక్షంగా పీకనొక్కేసే ధైర్యం చేసేవారు కాదనిచెప్పుకోవచ్చు. అసెంబ్లీలో స్వయంగా ఆమోదించి….గెలిచిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాటను ఏకపక్షంగా మూడు రాజధానులు అనేవారుకాదంటున్నారు. తనకు వచ్చిన భారీ మెజారిటీతో రాజకీయ ప్రత్యర్థుల్ని లేకుండా చేయాలనుకోవడం రాజకీయంగా వ్యతిరేకించే వారిపై పగ తీర్చుకోవడానికి అన్నట్లుగా వ్యవహరించడం దగ్గర్నుంచి అన్నీ ఆయన చేసిన తప్పిదాలే వైసీపీ ఓటమికి కారణం అయ్యాయి.
ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయామన్నదానిపై నిజాయితీగా విశ్లేషణ చేసుకుంటే తప్పులు దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అలాంటిదేమీ లేకుండా అంతా బాగుంది కానీ ఎందుకు ఓడిపోయామో తెలియదన్నట్లుగా నిప్పులపై దుప్పటి కప్పినట్లుగా వ్యవహరిస్తున్నారు. అసలు తమ ప్రభుత్వంపై వ్యతిరేకతే కనిపించలేదని ఆయన అంటున్నారు. తాము చేిసన మంచి ఇంకా ప్రజల్లో ఉందని నమ్ముతున్నారు.
అది ఆయన నమ్మకమో లేకపోతే మరొకటో కానీ..ఆయనకు తప్పులు దిద్దుకునే ఉద్దేశం లేదని.. అసలు ఓటమిపై సమీక్ష చేసుకోవడం ఇష్టం లేదని పార్టీ నేతలంటున్నారు. అందుకే ఐదేళ్లు కళ్లు మూసుకుంటే ప్రజలు మనకే ఓట్లేస్తారని ఆయన అనుకుంటున్నారు. కానీ రాజకీయాల్లో అలా అనుకుంటే పతనం చివరికి చేరుకున్నట్లేనని చరిత్ర నిరూపిస్తోందని కొంత మంది సీనియర్లు నిష్ఠూరమాడుతున్నారు.
